Sunday

పొట్ట కొట్టేవారిపైనే మా యుద్ధం: తెరాస అధినేత కేసీఆర్



పొట్టకూటి కోసం వచ్చి తమ పొట్టకొడుతున్న వారిపైనే తాము యుద్ధం చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ గ్రహించారన్నారు. అందుకే వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, ఫలితంగా సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. 
ఇకపోతే హైదరాబాద్‌కు పొట్టచేతబట్టుకుని వచ్చిన సీమాంధ్రులు ఇక్కడ తిష్టవేసి చివరకు తమ పొట్టకొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారిపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో జన్మించిన సీమాంధ్రులపై తాను చేసిన ప్రకటన వెనుక విశాల దృక్పథం ఉందన్నారు. వీరికి వ్యతిరేకంగా తామేమీ మాట్లాడటం లేదన్నారు. 
మధ్యలో వచ్చి స్థిరపడిన వారు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారన్నారు. అందువల్లే తాము ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ ఆరో‌ జోన్‌లో భాగమని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇది ఫ్రీజోన్ కాదన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

0 comments:

Post a Comment